తాము సంయుక్తంగా (భారత్తో పాటు) ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్-2026లో ఘోరంగా విఫలమైన (సూపర్-8 దశలో నిష్క్రమణ) తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు ప్రక్షాళన చేపట్టింది. టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తిని హెడ్ కోచ్గా ఎంపిక చేసుకుంది. అతని పేరు గ్యారీ కిర్స్టన్. ఈ సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ 2011లో టీమిండియాను జగజ్జేతగా (హెడ్ కోచ్గా) నిలిపాడు.

పొట్టి ప్రపంచకప్ వైఫల్యాల నేపథ్యంలో అప్పటివరకు హెడ్ కోచ్గా ఉండిన సనత్ జయసూర్య తన పదవికి రాజీనామా చేయడంతో లంక క్రికెట్ బోర్డు కిర్స్టన్ను ఎంపిక చేసింది. కిర్స్టన్ రెండేళ్ల ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ 15న బాధ్యతలు చేపడతారు. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా లంక క్రికెట్ కిర్స్టన్ నియామకం చేపట్టింది.
కిర్స్టన్ను హెడ్ కోచ్గా మంచి ట్రాక్ ఉంది. అంతర్జాతీయంగా, ఐపీఎల్లో అతను విజయవంతమైన జట్లకు కోచ్గా వ్యవహరించాడు. భారత్ను వన్డే ప్రపంచ ఛాంపియన్గా నిలపడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి కూడా చేర్చాడు.
అలాగే తన సొంత జట్టు దక్షిణాఫ్రికాకు కూడా విజయవంతంగా సేవలందించాడు. అతని కెరీర్లో ఏదైనా ఫెయిల్యూర్ ఉందా అంటే అది పాకిస్తాన్ వైట్ బాల్ జట్టుకు కోచ్గా సేవలందించడమే. పాక్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే అతను రాజీనామా చేశాడు (బోర్డు మరియు ఆటగాళ్లతో విభేదాల కారణంగా).
ఐపీఎల్లో కిర్స్టన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలతో పని చేశారు. టైటాన్స్ 2022లో తొలి సీజన్లోనే టైటిల్ గెలిచినప్పుడు అతను బ్యాటింగ్ కోచ్గా ఉన్నారు. 2027 వన్డే ప్రపంచకప్కు శ్రీలంకను నేరుగా అర్హత సాధించేలా చేయడమే కిర్స్టన్ ప్రధాన లక్ష్యం. లంక క్రికెట్ కొద్ది రోజుల క్రితమే తమ మహిళల జట్టు కోచ్ను ( జేమీ సిడ్డన్స్) కూడా మార్చింది.


