సలాం సామ్సన్‌... | Sanju Samson wins Player of the Tournament award | Sakshi
Sakshi News home page

సలాం సామ్సన్‌...

Mar 9 2026 4:19 AM | Updated on Mar 9 2026 4:19 AM

Sanju Samson wins Player of the Tournament award

‘ఏమాత్రం బాధపడవద్దు మిత్రమా. సుదీర్ఘ టోర్నీ ఇది. ఏదో ఒక సమయంలో అవకాశం కచ్చితంగా లభిస్తుంది’... వరల్డ్‌ కప్‌ తొలి రోజు అమెరికాతో మ్యాచ్‌కు ముందు సంజు సామ్సన్‌కు తుది జట్టులో స్థానం లభించని సమయంలో మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అతడికి సాంత్వన కలిగిస్తూ చెప్పిన మాట ఇది. తర్వాతి మ్యాచ్‌లో నమీబియాతో అభిషేక్‌ అనారోగ్య కారణంగా సామ్సన్‌కు అవకాశం దక్కింది. కానీ చేసింది 22 పరుగులే. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో టీమ్‌లో మళ్లీ చోటు లేదు. 

జింబాబ్వేపై చాన్స్‌ లభించినా 24 పరుగులకే పరిమితం! దాంతో సామ్సన్‌ టీమ్‌కు భారం, అతని భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది. కానీ సామ్సన్‌ ఓడిపోలేదు. ఇక తనకు చివరి అవకాశంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌ లభించింది. అంతే... అక్కడి నుంచి అసాధారణంగా చెలరేగిపోయాడు. వెస్టిండీస్‌తో కీలకపోరులో 50 బంతుల్లో 97 నాటౌట్‌... సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 42 బంతుల్లో 89... ఫైనల్లో న్యూజిలాండ్‌పై 46 బంతుల్లో 89... వరుసగా మూడు ముఖ్యమైన మ్యాచ్‌లలో మూడు అర్ధసెంచరీలతో తిరుగులేని ప్రదర్శన. మూడుసార్లూ త్రుటిలో సెంచరీ చేజారింది.

చివర్లో కాస్త ప్రయత్ని స్తే శతకాలు అతని ఖాతాలో చేరేవేమో. కానీ అతను వాటిని పట్టించుకోలేదు. ప్రతీ బంతిని జట్టు స్కోరు పెంచడానికే తప్ప ఒక్క బంతి కూడా తన వ్యక్తిగత ఘనతల కోసం ఆడేందుకు ప్రయత్ని ంచలేదు. కానీ ఈ మూడు మ్యాచ్‌లలో సామ్సన్‌ చూపించిన విధ్వంస ప్రదర్శన భారత జట్టులో అతని స్థాయిని అమాంతం పెంచేసింది. సామ్సన్‌కు అనవసరంగా మద్దతు ఇస్తున్నారని, అతనికి చోటు దండగ అంటూ వ్యాఖ్యానించిన వారే ఇప్పుడు అతని వల్లే వరల్డ్‌ కప్‌ గెలిచిందని ప్రశంసిస్తున్నారు. 

తన ఆటతోనే అందరికీ అతను ఇచ్చిన సమాధానం ఇది.  సామ్సన్‌ 2024లో వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. కానీ నాడు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే చాన్స్‌ రాకుండా ‘నామ్‌కే వాస్తే’గానే జట్టులో భాగంగా ఉన్నాడు. కానీ ఈసారి అతను విజయాన్ని శాసించాడు. కేవలం 5 ఇన్నింగ్స్‌లలో 321 పరుగులు సాధించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు కూడా గెల్చుకొని జట్టులో ఎవరికీ అందనంత ఎత్తులో అతను నిలిచాడు.  –సాక్షి క్రీడా విభాగం  

వెల్‌డన్‌... టీమిండియా 
న్యూఢిల్లీ: మూడోసారి టి20 ప్రపంచకప్‌ టైటిల్‌ గెలిచిన భారత పురుషుల క్రికెట్‌ జట్టుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అసాధారణ నైపుణ్యం, పట్టుదల, సమష్టి కృషికి భారత జట్టు విజయం నిదర్శనమని ‘ఎక్స్‌’ వేదికగా మోదీ ప్రశంసించారు. ‘టోర్నీ ఆద్యంతం అత్యద్భుత ఆటతీరుతో అలరించారు. దేశం మొత్తం గర్వపడేలా చేశారు. వెల్‌డన్‌... టీమిండియా’ అంటూ మోదీ కొనియాడారు. 

140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ సూర్యకుమార్‌ బృందం సాధించిన టి20 ప్రపంచకప్‌ విజయం చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి టీమిండియాను అభినందించారు. భవిష్యత్‌లో భారత్‌ మరిన్ని విజయాలు సాధించాలని కిషన్‌ రెడ్డి ఆకాంక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement