సాక్షి, అమరావతి: టి20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ బృందానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అద్భుతంగా ఆడి మళ్లీ చాంపియన్లుగా నిలిచిన కెప్టెన్ సూర్యకుమార్ నేతృత్వంలోని జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
తుదిపోరులో ప్రారంభం నుంచే భారత్ ఆధిపత్యం ప్రదర్శించిందని కొనియాడారు. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్ బాగా ఆడారని, చివరి విజయ క్షణాలు భారతీయులందరినీ గర్వపడేలా చేశాయని అభివర్ణించారు. వరల్డ్ కప్ కిరీటం తిరిగి మన ఇంటిలోనే ఉందంటూ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్లో టీమిండియా ప్రదర్శించిన అద్భుత ఆటతీరు దేశ ప్రజలందరికీ గర్వకారణమని కొనియాడారు. ఈ విజయం దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తెచ్చిందని రేవంత్ అన్నారు.


