ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్.. రెండో సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్- టీమిండియా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.
సఫారీ- కివీస్ జట్లు బుధవారం కోల్కతా వేదికగా అమీతుమీ తేల్చుకోనుండగా.. భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) ముంబై గురువారం సెమీ ఫైనల్లో పోటీపడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక సూపర్-8లో హ్యాట్రిక్ విజయాలతో ఇంగ్లండ్ జోరు మీద ఉండగా.. టీమిండియా మాత్రం సెమీస్ చేరేందుకు కష్టపడాల్సి వచ్చింది.
వీరోచిత ఇన్నింగ్స్
అయితే, వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ (50 బంతుల్లో 97 నాటౌట్)తో రాణించడంతో భారత్ గట్టెక్కి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ తప్పిదాలు.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్ప వేరే బౌలర్ ఎవరూ పెద్దగా రాణించకపోవడం.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ విఫలం కావడం సెమీస్కు ముందు ఆందోళన కలిగిస్తున్నాయి.
సంజూకు పొంచి ఉన్న ప్రమాదం
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో సెమీస్లో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న చర్చ నడుస్తోంది. గత మ్యాచ్లో అదరగొట్టిన సంజూకు ఈ మ్యాచ్లో మాత్రం జోఫ్రా ఆర్చర్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. గతేడాది అంతర్జాతీయ టీ20లలో ఈ ఇంగ్లండ్ పేసర్ సంజూను బాగా ఇబ్బంది పెట్టాడు.
సంజూకు ఆర్చర్ 23 డెలివరీలు సంధించగా.. అతడు కేవలం 25 పరుగులే రాబట్టగలిగాడు. ఇందులో ఒక ఫోర్, రెండు సిక్స్లు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు.. మూడుసార్లు ఆర్చర్ బౌలింగ్లో అవుటయ్యాడు.
ఆర్చర్తో పాటు అతడూ
ఒకవేళ ఇంగ్లండ్ ఈసారి కూడా ఆర్చర్తోనే బౌలింగ్ ఎటాక్ ఆరంభిస్తే.. ఓపెనర్ సంజూ మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇక సామ్ కర్రాన్ కూడా సంజూకు సవాలు విసిరే అవకాశం ఉంది.
పొట్టి క్రికెట్లో నాలుగేళ్లలో సామ్ సంజూకు 16 డెలివరీలు సంధించగా.. అతడు 21 పరుగులు చేయగలిగాడు. రెండుసార్లు అవుటయ్యాడు. ఈ ప్రమాదాల్ని అధిగమిస్తేనే సంజూ టీమిండియాకు మంచి ఆరంభం ఇవ్వగలడు. గత గణాంకాలను బట్టి సంజూను తుదిజట్టులో ఆడిస్తారా?.. ఒకవేళ ఆడించినా ఓపెనర్గా పంపుతారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
వేటు పడుతుందా?
అయితే, సంజూపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ విండీస్తో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ ఇంగ్లండ్తో సెమీ ఫైనల్ ఆడనున్నట్లు తెలుస్తోంది.
కాగా గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమైన సంజూ ఓపెనర్గా, వికెట్ కీపర్గా జట్టులో స్థానం కోల్పోయాడు. టీ20 ప్రపంచకప్లో నమీబియాతో ఆడిన అతడు.. ఆ తర్వాత మళ్లీ సూపర్-8లో జింబాబ్వే, వెస్టిండీస్లతో ఆడాడు. మొత్తంగా మూడు మ్యాచ్లలో కలిపి 143 పరుగులు సాధించాడు.
వెస్టిండీస్తో ఆడిన భారత తుదిజట్టు
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్!


