అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ద ప్రభావం భారత్, శ్రీలంక దేశాల్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026పై పడింది. ఈ మెగా టోర్నీలో సూపర్-8 దశలో నిష్క్రమించిన వెస్టిండీస్ జట్టు.. అంతర్జాతీయ ఎయిర్స్పేస్ పరిమితుల కారణంగా భారత్లోనే చిక్కుకుపోయింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు ప్రతిగా ఇరాన్ పలు గల్ఫ్ ప్రాంతాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. విండీస్ జట్టు స్వదేశానికి చేరాలంటే దుబాయ్ మీదుగా వెళ్లాల్సి ఉంది.
అయితే యుద్ద నేపథ్యంలో పరిస్థితులు అనూకలించకపోవడంతో విండీస్ జట్టు భారత్లోనే హాల్ట్ అయ్యింది. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. వీలైనంత త్వరగా తమ జట్టును స్వదేశానికి చేర్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విషయంలో విండీస్ బోర్డుకు ఐసీసీ, బీసీసీఐ సహకరిస్తున్నాయి.
మరోవైపు విండీస్లాగే మరో జట్టు కూడా భారత్లోనే ఇరుక్కుపోయింది. విండీస్లాగే సూపర్-8లోనే నిష్క్రమించిన జింబాబ్వే కూడా యుద్ద ప్రభావం చేత విమాన రాకపోకలు నిలిచిపోవడంతో భారత్లో హాల్ట్ అయ్యింది. జింబాబ్వే కూడా స్వదేశానికి వెళ్లలంటే దుబాయ్ మీదుగా వెళ్లాల్సిందే. జింబాబ్వే పరిస్థితిని కూడా ఐసీసీ దగ్గరగా పర్యవేక్షిస్తుంది. వీలైనంత త్వరగా జింబాబ్వే జట్టును స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
ఇదిలా ఉంటే వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ప్రపంచకప్లో సూపర్-8లోనే నిష్క్రమించాయి. ఈ రెండు జట్లు భారత్తో పాటు గ్రూప్-1లో ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, సౌతాఫ్రికా సెమీస్కు చేరాయి. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్-4కు అర్హత సాధించాయి.
తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.


