IND VS ENG Semis: చరిత్ర పునరావృతమవుతుందా.. లేక..! | T20 WC 2026: India and England met in semis in last two editions also | Sakshi
Sakshi News home page

IND VS ENG Semis: చరిత్ర పునరావృతమవుతుందా.. లేక..!

Mar 3 2026 11:31 AM | Updated on Mar 3 2026 12:08 PM

T20 WC 2026: India and England met in semis in last two editions also

టీ20 ప్రపంచకప్‌ 2026 రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీకి సిద్దంగా ఉన్నాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ హోరాహోరీ సమరం జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటకు ప్రారంభమవుతుంది.

ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర అంశం సోషల్‌మీడియాలో హైలైట్‌ అవుతుంది. గత మూడు టీ20 ప్రపంచకప్‌ ఎడిషన్లలో భారత్‌-ఇంగ్లండ్‌ సెమీఫైనల్లోనే ఎదురెదురుపడ్డాయి. 2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడమే కాకుండా, రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

2024 ఎడిషన్‌లో భారత్‌ ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడమే కాకుండా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2026 ఎడిషన్‌లోనూ ఇరు జట్లు సెమీస్‌లో ఎదురెదురుపడటంతో, సెంటిమెంట్‌ ప్రకారం ఈ మ్యాచ్‌ విజేత టైటిల్‌ కూడా ఎగరేసుకుపోతుందని చర్చ నడుస్తుంది. అయితే ఈ సెంటిమెంట్‌ రిపీటైతే భారత్‌కు ప్రతికూల ఫలితం వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఎందుకుంటే, గత రెండు ఎడిషన్లలో గెలుపు చేతులు మారింది. 2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ భారత్‌ను ఓడిస్తే.. 2024 ఎడిషన్‌లో భారత్‌ ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ లెక్కన రొటేషన్‌ పద్దతిలో ఈసారి ఇంగ్లండ్‌ గెలుస్తుందని సెంటిమెంట్లు ఫాలో అయ్యే వారు విశ్వసిస్తున్నారు.

అయితే క్రికెట్‌ లాంటి క్రీడల్లో సెంటిమెంట్లకు విశ్వసనీయత లేదని గతంలో చాలా సందర్భాల్లో రుజువైంది. కాబట్టి ఆ రోజు ఏ జట్టు అత్యుత్తమంగా రాణిస్తుందో ఆ జట్టుకే విజయం దక్కే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగనీ సెంటిమెంట్లను తీసి వేయడానికి కూడా వీల్లేదు. కొన్ని సందర్భాల్లో అవి కూడా వర్కౌటవుతాయి.

సెంటిమెంట్ల విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుత ఎడిషన్‌లో భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు పటిష్టంగా ఉన్నాయి. లోతుగా పరిశీలిస్తే..ఇంగ్లండ్‌ కంటే టీమిండియానే క్తాస మెరుగ్గా ఉంది. ఈసారి హాట్‌ ఫేవరెట్‌ కూడా ఇండియానే. అలాగనీ ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వారిదైన రోజున వారు అద్భుతాలు చేస్తారు. 

ప్రస్తుతం వారి జట్టు బ్యాటింగ్‌ టాపార్డర్‌ కాస్త బలహీనంగా ఉంది. ఓపెనర్లు సాల్ట్‌, బట్లర్‌ సహా జేకబ్‌ బేతెల్‌ తరుచూ విఫలమవుతున్నారు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌, మిడిలార్డర్‌ బ్యాటర్ల సాయంతోనే ఆ జట్టు ఈ ఎడిషన్‌లో విజయాలు సాధించింది. బ్యాటింగ్‌తో పోలిస్తే.. ఆ జట్టు బౌలింగ్‌ విభాగంలో కాస్త మెరుగ్గా ఉంది. అయితే ఈ రెండు విభాగాల్లో ఇంగ్లండ్‌ కంటే భారత్‌ ఇంకాస్త మెరుగ్గా ఉంది. 

ఫీల్డింగ్‌ మినహా భారత్‌ అన్ని విషయాల్లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధించే అవకాశం ఉంది. సెమీస్‌కు ముందు టీమిండియాను ఫీల్డింగ్‌ విషయం చాలా కలవరపెడుతుంది. తాజాగా విండీస్‌తో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 క్యాచ్‌లు నేలపాలు చేశారు. 

సూపర్‌-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త ఫీల్డింగ్‌ ప్రదర్శన టీమిండియాదే. ఫీల్డింగ్‌ మినహా మిగతా అన్ని విభాగాల్లో భారత్‌దే పైచేయిగా ఉంది. మ్యాచ్‌కు ముందు ప్రదర్శనలు ఎలా ఉన్నా, ఆ రోజు మ్యాచ్‌లో ఎవరు రాణిస్తే వారికే అంతిమ విజయం దక్కుతుంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement