మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జింబాబ్వే మహిళల జట్టుతో ఇవాళ (మార్చి 8) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. డునెడిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే ఇదే డునెడిన్ వేదికగా మార్చి 11న జరుగనుంది.
వన్డే సిరీస్కు ముందు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను కూడా న్యూజిలాండే 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం జింబాబ్వే మహిళల జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. కెప్టెన్ అమేలియా కెర్ (9.1-1-34-7) విజృంభించడంతో 29.1 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. కెర్కు పెన్ఫోల్డ్ (4-1-17-3) సహకరించింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో ముపచిక్వ (32) మినహా ఒక్కరు కూడా కనీసం 15 పరుగుల మార్కును తాకలేకపోయారు. నలుగురు డకౌట్లు కాగా.. ముగ్గురు అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ బ్యాటర్లు ఆడుతూపాడుతూ ఛేదించారు. బంతితో విజృంభించిన కెర్ (45) బ్యాట్తోనూ సత్తా చాటి ఒంటిచేత్తో తన జట్టుకు విజయాన్నందించింది. కెర్కు మరో ఓపెనర్ ఇసబెల్లా గేజ్ (20), మ్యాడీ గ్రీన్ (27 నాటౌట్), బ్రూక్ హల్లీడే (7 నాటౌట్) సహకరించడంతో న్యూజిలాండ్ 16.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జింబాబ్వే బౌలర్లలో మజ్విషయా, చటోంజ్వాకు తలో వికెట్ దక్కింది.


