టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ గత కొంతకాలంగా విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అతడి వైఫల్యాలే ఇందుకు కారణం. ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కెరీర్లో తొలిసారి వరల్డ్కప్ ఆడుతున్నాడు.
మూడు డకౌట్లు
విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. సొంతగడ్డపై భారీ అంచనాల నడుమ బరిలోకి దిగాడు. అయితే, ఆడిన తొలి మూడు మ్యాచ్లలో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఆరు మ్యాచ్లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 80.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో కీలక సెమీ ఫైనల్కు ముందు భారత జట్టు మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అభిషేక్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. వరుస వైఫల్యాల కారణంగా అతడు మానసికంగా కాస్త కుంగిపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. అలాంటపుడు తుదిజట్టు నుంచి అభిషేక్ శర్మను తప్పించడమే సరైన నిర్ణయమని పేర్కొన్నాడు.
అదొక్క మార్పు సరిపోతుంది
ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘నెట్స్లో బ్యాటింగ్ తీరును చూసి అంచనాకు రాకూడదు. అతడితో ప్రత్యేకంగా మాట్లాడాలి. మానసికంగా అతడు ఎంత దృఢంగా ఉన్నాడో తెలుసుకోవాలి.
ఒకవేళ అభిషేక్ శర్మను కొనసాగించకూడదని అనుకుంటే.. ఇషాన్ కిషన్ను ఓపెనర్గా ఆడించాలి. లోయర్ ఆర్డర్లో రింకూ సింగ్ను తీసుకువస్తే సరి. సెమీ ఫైనల్లో తుదజట్టులో అదొక్క మార్పు సరిపోతుంది.
అయితే, అభిషేక్ శర్మ గత సిరీస్లో ఇంగ్లండ్ మీద అదరగొట్టిన తీరును మర్చిపోకూడదు. వాంఖడేలో గతంలో అతడి ప్రదర్శన అద్భుతం.
అక్కడ అతడు భారీ, వేగవంతమైన శతకాలు బాదాడు. కాబట్టి అభిషేక్ శర్మను కొనసాగిస్తే బాగుంటుందనీ అనుకుంటున్నాను ఒకవేళ రింకూను తీసుకురావాలని అనుకుంటే మాత్రం ఓపెనింగ్ జోడీ మారక తప్పదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
గతేడాది ఇంగ్లండ్పై ఇరగదీసిన అభిషేక్
కాగా గతేడాది వాంఖడే వేదికగా ఇంగ్లండ్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ 54 బంతుల్లోనే 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ పొట్టి క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్గా అతడు చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం వేదికగా భారత్- ఇంగ్లండ్ సెమీ ఫైనల్లో తలపడేందుకు రంగం సిద్ధమైంది.
చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్!


