టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్తో కీలక సెమీ ఫైనల్లోనూ పేలవ ఆట తీరుతో తేలిపోయాడు. వైఫల్యాల పరంపర కొనసాగిస్తూ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా అభిమానులు సైతం అభిషేక్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్-2026 ఆరంభం నుంచి అభిషేక్ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ డకౌట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. సూపర్-8 దశలో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్లో పదిహేను పరుగులకే పెవిలియన్ చేరిన అభిషేక్.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్లో మాత్రం అర్ధ శతకంతో రాణించాడు.
పాత కథే పునరావృతం
అయితే, సూపర్-8లో కీలకమైన వెస్టిండీస్తో మ్యాచ్లో మరోసారి తేలిపోయాడు అభిషేక్ శర్మ. పట్టుమని పది పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్లో అతడిని ఆడించే విషయంలో పునరాలోచన చేయాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, యాజమాన్యం మాత్రం అభిషేక్పై నమ్మకం ఉంచగా.. అతడు పాత కథనే పునరావృతం చేశాడు.
తొమ్మిది పరుగులే చేసి
ముంబై వేదికగా గురువారం ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఏడు బంతుల్లో రెండు ఫోర్లు బాది కేవలం తొమ్మిది పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఓవర్లో విల్ జాక్స్ బంతితో రంగంలోకి దిగి ఆఖర్లో స్లోబాల్ వేశాడు.
ఈ క్రమంలో భారీ షాట్కు యత్నించిన అభిషేక్.. బంతిని గాల్లోకి లేపగా డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన ఫిల్ సాల్ట్ బంతిని ఒడిసిపట్టాడు. దీంతో అభిషేక్ శర్మ పెవిలియన్ చేరాడు. మరోసారి ఆఫ్ స్పిన్నర్ చేతికి చిక్కి నిరాశగా వెనుదిరిగాడు.
ఇప్పటి వరకు అభిషేక్ శర్మ ఈ టోర్నీలో చేసిన పరుగులు 89. వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా అభిమానులు అభిషేక్పై భగ్గుమంటున్నారు. ‘‘ నువ్విక మారవా?.. అతడిని జట్టు నుంచి తీసేయండి’’ అని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


