న్యూఢిల్లీ: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ కొత్త ప్రసార రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పటి వరకు జరిగిన అన్నీ టోర్నీల కంటే ఈ వరల్డ్కప్నకు అత్యధి వీక్షణలు వచ్చాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు జై షా బుధవారం తెలిపారు. పాత రికార్డులన్నింటిని తిరగరాస్తూ తాజా టోర్నమెంట్ వీక్షకుల సంఖ్య 500 మిలియన్ (50 కోట్లు)లను అధిగమించిందని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండే టోర్నమెంట్గా ఇది నిలిచిందని... డిజిటల్ వినియోగం ద్వారానే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని జై షా అన్నారు. ‘ఈ వరల్డ్కప్ను విశ్వవ్యాప్తం చేయాలని టోర్నీ ఆరంభానికి ముందే లక్ష్యంగా పెట్టుకున్నాం. భారత్లో జరుగుతున్న ఈ ఈవెంట్ వీక్షకుల సంఖ్య 500 మిలియన్లు దాటింది. టి20 ప్రపంచకప్ల చరిత్రలో ఇదే అత్యధికం.
జియో హాట్స్టార్లో ఏకకాలంలో 60.5 మిలియన్ల గరిష్ట వీక్షకులను చూడటం చాలా సంతోషంగా ఉంది’ అని జై షా సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. తాజా టోర్నీలో సెమీఫైనల్స్, ఫైనల్ జరగకముందే... 2024లో అమెరికాలో జరిగిన వరల్డ్కప్ కంటే ఎక్కువమంది ఈవెంట్ను వీక్షించడం గమనార్హం. చివరి మూడు మ్యాచ్లు ముగిసేసరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


