క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఐపీఎల్-2026 సీజన్ ప్రారంభ తేదీ మారింది. గతంలో ఈ మెగా టోర్నీని మార్చి 26న ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ఈ టీ20 క్రికెట్ టోర్నీ మార్చి 28 నుంచి షురూ కానుంది. ఈ విషయాన్ని భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది.
ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నట్లు సమాచారం. కాగా గత ఏడాది జూన్లో ఆర్సీబీ టైటిల్ సెలబ్రేషన్స్ సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లను నిలిపివేశారు. ఇప్పుడు కర్ణాటక సర్కార్ నుంచి అనుమతి లభించడంతో చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ సందడి మళ్లీ మొదలు కానుంది.
ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్లలో 5 మ్యాచ్లను బెంగళూరులో, మిగిలిన 2 మ్యాచ్లను రాయ్పూర్లో ఆడనుంది. కాగా ఫైనల్ లేదా ఓ ప్లే ఆఫ్ మ్యాచ్కు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది.


