న్యూఢిల్లీ: దేశంలో నైరుతి రుతుపవనాల కాలంలో ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఉండే ద్వితీయార్ధంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం నెలవారీ అంచనాలను విడుదల చేసింది. వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)లో 94 శాతం కంటే తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఎల్పీఏ అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో నెల లేదా రుతువు వంటి నిర్ణీత కాలంలో నమోదైన వర్షపాతం సగటును సూచిస్తుంది.
ఈ సగటును సాధారణంగా 30 నుండి 50 ఏళ్ల వంటి సుదీర్ఘ కాల వ్యవధి ఆధారంగా లెక్కిస్తారు. 1971 నుండి 2020 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా నమోదయ్యే వర్షపాతం దీర్ఘకాలిక సగటు 422.8 మిల్లీమీటర్లు. ఆగస్టు–సెపె్టంబర్ కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెటియోరాలజీ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర స్పష్టంచేశారు.
అయితే, దక్షిణ భారతదేశం, మధ్య భారతదేశం, వాయువ్య భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలు, తూర్పు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణ లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. జూన్, జూలై మధ్య కాలంలో 13 శాతం వర్షపాతం లోటు నమోదయ్యింది. జూన్ నెలాఖరు నాటికి ఈ లోటు 35.4 శాతంగా ఉంది. జూలైలో కురిసిన మంచి వర్షాల కారణంగా వర్షపాతం లోటు తగ్గిందని అని డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు.


