ట్రంప్‌ సుంకాలు: భారత్‌కు భారీ ఊరట | Trump Lifts 25% Tariff On India Over Russian Oil Imports | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ సుంకాలు: భారత్‌కు భారీ ఊరట

Feb 7 2026 6:55 AM | Updated on Feb 7 2026 8:33 AM

Trump Lifts 25% Tariff On India Over Russian Oil Imports

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధిస్తున్న సుంకాల విషయంలో భారత్‌కు భారీ ఊరట లభించింది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల విషయంలో నెలకొన్న వివాదానికి తెరదించుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన అదనపు 25 శాతం సుంకాలను రద్దు చేస్తూ శుక్రవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిన నేపథ్యంలో ఈ వాణిజ్య ఒప్పందం కుదిరింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఈ సుంకాల రద్దు అమలులోకి రానుంది.

ఈ ఒప్పందంలో భాగంగా భారత్ ఇకపై అమెరికా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. రాబోయే పదేళ్ల కాలానికి అమెరికాతో రక్షణ సహకారాన్ని విస్తృతం చేసేలా ఒక కీలక ఫ్రేమ్‌వర్క్‌కు భారత్‌ అంగీకారం తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కారణంగా ఇరు దేశాల మధ్య గత కొద్ది నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజా ఒప్పందంతో ఈ సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా, ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది.

రాబోయే ఐదేళ్లలో అమెరికా నుంచి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, విమానాలు, విమాన విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్‌ను భారత్ కొనుగోలు చేయనుంది. దీనికి ప్రతిగా విమానాలు, వాటి విడిభాగాలపై విధిస్తున్న సుంకాలను కూడా అమెరికా తొలగించనుంది. గత ఏడాది చివరలో భారత ఉత్పత్తులపై దాదాపు 50 శాతంగా ఉన్న సుంకాలు, ఈ కొత్త ఒప్పందంతో గణనీయంగా తగ్గి 18 శాతానికి చేరుకున్నాయి.

తాజా సుంకాల తగ్గింపుతో పొరుగు దేశాల కంటే భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో స్వల్ప ప్రయోజనం చేకూరనుంది. ఇతర దేశాలపై 19 నుంచి 20 శాతం సుంకాలు ఉండగా, భారత్‌కు అది 18 శాతానికి తగ్గింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ‘గొప్ప స్నేహితులలో ఒకరు’ అని అభివర్ణించిన ట్రంప్, ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తానని హామీ ఇచ్చిన దరిమిలా ఈ సానుకూల నిర్ణయం సాధ్యమైందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: రంజాన్ 2026: సౌదీ అరేబియా కీలక ప్రకటన

Advertisement
 
Advertisement
Advertisement