ఆకట్టుకున్న జైళ్లశాఖ ఉత్పత్తుల స్టాళ్లు
ఆరిలోవ: జైళ్ల శాఖ తొమ్మిదో జాతీయ సదస్సు బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. భారత ప్రభుత్వ హోం శాఖకు చెందిన పోలీస్ పరిశోధన, అభివృద్ధి బ్యూరో(బీపీఆర్ అండ్ డీ) ఆధ్వర్యంలో సాయిప్రియ రిసార్ట్స్లో జరిగిన సదస్సులో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కేంద్ర కారాగారాల్లో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ, ఒడిశా, రాజస్తాన్, గుజరాత్, అస్సాం తదితర రాష్ట్రాల జైళ్లలో తయారైన దుస్తులు, చెప్పులు, నూలు బ్యాగులు, బుట్టలు, చెక్క వస్తువులు, మేటీలు, దుప్పట్లు, నూనెలు, రకరకాల పిండిలు, బేకరీ పదార్థాలు తదితర ఉత్పత్తులు ఆకర్షణగా నిలిచాయి. ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల జైళ్ల శాఖ డీజీలు, ఐజీలు, డీఐజీలతో పాటు కేంద్ర కారాగారాల పర్యవేక్షణాధికారులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల జైళ్లలో కస్టడీలో ఉన్న బలహీన వర్గాల అవసరాలను తీర్చడం, సమగ్రమైన, సురక్షితమైన, ప్రభావవంతమైన సంరక్షణ ఎలా అందించాలి అనే అంశంపై చర్చించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ మాట్లాడుతూ
దేశంలో జైళ్ల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా అదనపు జైళ్లు, బేరక్లు నిర్మాణాలు, సంక్షేమం తదితర వాటి కోసం రూ.950 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఖైదీలలో పరివర్తనం కలిగే విధంగా అధికారులు చొరవచూపాలన్నారు. అనంతరం జైళ్ల శాఖ అధికారులు తమ రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న సంక్షేమం, పాలన విధానం, అక్కడ జైళ్ల అభివృద్ధి, ఉద్యోగుల నియామకాల గురించి వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో బీపీఆర్డీ డీజీ అలోక్ రంజన్, ఏపీ డీజీ అంజనికుమార్, ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు, డీఐజీ రవిశంకర్, ఉత్తర ప్రదేశ్ డీజీ పి.సి మీనా, వివిధ రాష్ట్రాల డీజీలు, ఐజీలు, డీఐజీలు, కేంద్ర కారాగారాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న జైళ్లశాఖ ఉత్పత్తుల స్టాళ్లు
ఆకట్టుకున్న జైళ్లశాఖ ఉత్పత్తుల స్టాళ్లు


