రంజీ సమరంలో విశాఖ కుర్రాళ్ల జోరు
విశాఖ స్పోర్ట్స్ : కల్యాణ్ వేదికగా బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ నాకౌట్ పోరులో ఆంధ్ర జట్టు తొలి రోజే తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినా, విశాఖ కుర్రాళ్లు పట్టుదలతో రాణించడంతో ఆంధ్ర గౌరవప్రదమైన స్థితికి చేరుకుంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ రికీ భుయ్ తన ఫామ్ను కొనసాగిస్తూ 83 పరుగులతో (8 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ముందుండి నడిపించాడు. లీగ్ దశలోనే పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న రికీ, ఈ కీలక మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ అర్ధ సెంచరీకి చేరువగా వచ్చి 47 పరుగుల వద్ద రెండో వికెట్గా వెనుదిరిగినప్పటికీ, జట్టుకు మంచి పునాది వేశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డితో కలిసి రికీ భుయ్ ఐదో వికెట్కు ఏకంగా 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి బెంగాల్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 33 పరుగులు చేసిన నితీష్ కుమార్, ముకేశ్ బౌలింగ్లో అవుట్ కావడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర ఆరు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం శశికాంత్ ఏడు పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు.
గత రికార్డులను పరిశీలిస్తే బెంగాల్పై ఆంధ్ర జట్టుకే పైచేయి కనిపిస్తోంది. ఇప్పటివరకు తలపడిన ఐదు మ్యాచ్లలో ఆంధ్ర రెండుసార్లు విజయం సాధించగా, మిగిలిన మూడు మ్యాచ్లు డ్రా అయ్యాయి. బెంగాల్పై రికీ భుయ్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 175 పరుగులు కాగా, బౌలింగ్లో శశికాంత్ 55 పరుగులకే 5 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. బెంగాల్ పేసర్ షమీ బౌలింగ్ను ఎదుర్కొంటూ మిగిలిన రోజుల్లో ఆంధ్ర బ్యాటర్లు భారీ స్కోరు సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
భరత్
నితీష్
శశికాంత్
రికీ,నితీష్ సెంచరీ భాగస్వామ్యం
రంజీ సమరంలో విశాఖ కుర్రాళ్ల జోరు
రంజీ సమరంలో విశాఖ కుర్రాళ్ల జోరు


