రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు అండగా ఉంటాం
విశాఖ సిటీ: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తా మని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ తెలిపారు. ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండో రోజు గురువారం కూడా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఏపీఎన్జీవో హోంలో జరిగింది. పలువురు జర్నలిస్టులకు నూతన, రెన్యూవల్ సభ్యత్వ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతేడాది తమ యూనియన్లో 600 మంది సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో కూడా నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన ప్రధానమైన 11 డిమాండ్ల సాధనకు తమ రాష్ట్ర కార్యవర్గం ద్వారా కృషి చేస్తున్నామన్నారు. ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాస రావు, ఏపీబీజేఏ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బొబ్బర ప్రసాద్, సంయుక్త కార్యదర్శి రాజశేఖర్, వై.రవికుమార్, రాజేష్ పాల్గొన్నారు.


