దళిత భూముల్లో పెట్రోల్ బంకా?
అగనంపూడిలో ఐవోసీ పనుల అడ్డగింత
భూకేటాయింపులపై
మహిళల ఆందోళన
నిరసనకారులను అదుపులోకి
తీసుకున్న పోలీసులు
అగనంపూడి: గతంలో తమకు కేటాయించిన భూములను ఐవోసీ పెట్రోల్ బంక్కు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తూ అగనంపూడి ప్రాంతానికి చెందిన దళితులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గాజువాక మండలం, అగనంపూడి రెవెన్యూ సర్వే నంబర్ 56 పార్ట్ 1ఏలో గల 1.60 ఎకరాల స్థలాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఐఓసీ పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం కేటాయించింది. అయితే నాలుగు దశాబ్దాల క్రితమే ఈ భూములు తమకు డీ–ఫారం పట్టాల రూపంలో మంజూరయ్యాయని, ప్రస్తుతం న్యాయస్థానంలో స్టే ఆర్డర్ కూడా ఉందని బాధితులు వాదిస్తున్నారు. గతంలో పిలకవానిపాలెం, నక్కవానిపాలెం నిర్వాసితులకు ఈ భూములను ఇచ్చే ప్రయత్నం జరగగా, పట్టాదారులు కోర్టును ఆశ్రయించి యథాతథ స్థితి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. భూముల విలువ పెరగడంతో ప్రభుత్వం పాత పట్టాలను రద్దు చేసి, రెండేళ్ల క్రితం ఇక్కడ రైతు బజార్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి, ఐవోసీకి స్థలాన్ని కేటాయించడంతో వివాదం మళ్లీ మొదలైంది. గురువారం ఉదయం ఐవోసీ సిబ్బంది సదరు స్థలంలో పనులు ప్రారంభించగా, పట్టాదారులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. దీంతో ఐవోసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. ఈ క్రమంలో 13 మంది మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం పూచీకత్తుపై విడుదల చేశారు. తమ భూములను అక్రమంగా వేరే సంస్థలకు కట్టబెట్టడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దళిత భూముల్లో పెట్రోల్ బంకా?


