వికసిత భారత్ దిశగా అడుగులు వేయాలి
20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ లంక దినకర్
మహారాణిపేట: ‘వికసిత భారత్’ సంకల్పం, ‘స్వర్ణాంధ్ర–2047’ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ లంక దినకర్ కోరారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజులతో కలసి విద్య, వైద్యం, జలజీవన్ మిషన్, పీఎం.సూర్యఘర్ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖను వికసిత విశాఖ జిల్లాగా తీర్చిదిద్దడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి స్వచ్ఛమైన నీరు అత్యంత అవసరమని, అందుకే జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, పథకంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. జిల్లాలో వైద్య, విద్య శాఖల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నందుకు అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రోత్ రేట్ పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.


