ప్రజలకు సంతృప్తిగా సేవలందించాలి
కలెక్టర్ హరేందిర ప్రసాద్
బీచ్రోడ్డు: జిల్లా ప్రజలు సంతృప్తి చెందే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా, జోనల్, మండల అధికారులతో పాజిటివ్ పబ్లిక్, పర్సెప్షన్, కుటుంబ సర్వే, ఎలక్టర్స్ మ్యాపింగ్ తదితర అంశాలపై కలెక్టర్ వెబ్ ఎక్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలపై ఐవీఆర్ఎఫ్, క్యూఆర్ కోడ్ పద్ధతిలో అభిప్రాయాలను సేకరిస్తున్నందున అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. రోగులకు ఉచితంగా మందులు అందించాలని కోరారు. లంచం అడిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులు సమయానికి నడిచేలా, ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. జీవీఎంసీ పరిధిలో గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యం, అన్న క్యాంటీన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అక్రమంగా మత్తు మందులు అమ్మేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి సరఫరా చేసేవారికి శిక్ష తప్పదన్నారు. రెవెన్యూలో డిజిటల్ అసిస్టెంట్లు దరఖాస్తులు తీసుకునేటప్పుడు వీఆర్వో సంతకం ఉంటేనే తీసుకుంటామని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, సర్వే నెంబర్తో దరఖాస్తు ఇస్తే రిజిస్టర్ చేయాలన్నారు. ఐఎఫ్ఆర్–2026, మిలాన్ అంతర్జాతీయ నౌకాదళ కార్యక్రమాల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ హరేందిర ప్రసాద్ జ్ఞానాపురం నుంచి నేవీ హెడ్క్వార్టర్స్ వరకు కొనసాగుతున్న రహదారి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈనెల 15వ తేదీలోగా పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, టూరిజం, విద్యుత్, ఫైర్, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


