ఏప్రిల్ నాటికి పేదల గృహాలకు సోలార్ వెలుగులు
కొమ్మాది: రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ద్వారా విద్యుత్ లబ్ధి చేకూరుతుందని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ అన్నారు. సోమవారం సాగర్నగర్లో నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం సూర్యఘర్–ముఫ్త్ బిజిలీ యోజన’ కింద పేద కుటుంబాలకు సౌర విద్యుత్ అందించడంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 328 మెగావాట్ల సామర్థ్యంతో 94 వేల కనెక్షన్లు ఉండగా, కేవలం ఈపీడీసీఎల్ పరిధిలోనే 142 మెగావాట్ల సామర్థ్యంతో 44,452 ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. క్లస్టర్ విధానంలో 41 సంస్థలకు టెండర్లు కేటాయించామని, ప్రతిరోజూ 250 కొత్త కనెక్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును ఏప్రిల్ 2026 నాటికి మెజారిటీ భాగం, మే నాటికి పూర్తిస్థాయిలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పృథ్వితేజ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంఎన్ఆర్ఈ డైరెక్టర్ ఆదిత్య ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


