ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం..
అబద్ధపు హామీలతో మోసం చేసి చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాడు
ఉత్తరాంధ్ర ప్రచార విభాగం సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
హాజరైన ఉత్తరాంధ్ర ప్రచార విభాగం అధ్యక్షుడు రవిరాజు, ఆయా జిల్లాల ప్రచార విభాగం అధ్యక్షులు
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికలకు ముందు ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు అనంతరం అన్నింటిని విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. శనివారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రచార విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు జి.వి.రవిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర ప్రచార విభాగం సమావేశానికి కేకే రాజు, రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ హాజరయ్యారు. తొలుత బి.ఆర్.అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును ప్రజలకు వివరిస్తూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలపై చేసే పోరాటంలో వైఎస్సార్ సీపీ ప్రచార విభాగమే ముందుండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ఉన్న ప్రచార విభాగం అధ్యక్షులు, కార్యవర్గం అందరూ తమ స్థాయిలో ఉన్న ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీయాలని, వాటిపై పోరాటం చేయాలన్నారు. తమ దగ్గర ఉన్న స్మార్ట్ మొబైల్నే ఆయుధంగా చేసుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రచార విభాగం జిల్లా అధ్యక్షులు కాయ భీమసేన(శ్రీకాకుళం), వలిరెడ్డి శ్రీనివాస నాయుడు(విజయనగరం), గిరి రఘు(పార్వతీపురం మన్యం జిల్లా), ధోని బాపూజీ (అల్లూరి సీతారామరాజు), పిల్లా శ్రీను(అనకాపల్లి), రాష్ట్ర ప్రచార విభాగం కమిటీ ఉపాధ్యక్షులు రావూరి వెంకటేశ్వరరావు, కాకూ ఉమావల్లి యాదవ్, ప్రధాన కార్యదర్శి బెతపూడి రాజేంద్ర కుమార్, కార్యదర్శులు బంకుపల్లి లోకనాథం శర్మ, పొడిపిరెడ్డి అరుణ, అహరోన్ పాల్, వామిశెట్టి పవన్ కుమారి, వట్టికూటి కృష్ణవేణి, మహంతి కృష్ణమోహన్, సురేష్, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర క్రిస్టియన్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ, ఎస్ఈసీ సభ్యుడు సతీష్వర్మ పాల్గొన్నారు.


