సైక్లోథాన్ జాతీయ ఉద్యమంగా అవతరణ
సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శరవణన్
మహారాణిపేట : సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వందేమాతరం సైక్లోథాన్–2026’ కార్యక్రమం దేశవ్యాప్తంగా జాతీయ భద్రత, తీరప్రాంత రక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించే శక్తివంతమైన ఉద్యమంగా మారిందని సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శరవణన్ అన్నారు. ఈ కార్యక్రమం సీఐఎస్ఎఫ్ కుటుంబంలో నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు. ఈ నెల 28న ‘సురక్షిత తట–సమృద్ధ్ భారత్’ నినాదంతో సైక్లోథాన్ రెండో ఎడిషన్ ప్రారంభమైందని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. చిన్న స్థాయిలో మొదలైన ఈ కార్యక్రమం నేడు ప్రజల భాగస్వామ్యంతో దేశభక్తిని పెంపొందించే జాతీయ ఉద్యమంగా రూపాంతరం చెందిందన్నారు. విశాఖలో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పారు. ఇది కేవలం 6,600 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం మాత్రమే కాకుండా ప్రజలతో నేరుగా మమేకమై భద్రతపై అవగాహన కల్పించే యజ్ఞమని పేర్కొన్నారు. ఇప్పటివరకు సైక్లిస్టులు 2,400 కిలోమీటర్లు పూర్తి చేశారని తెలిపారు. ఈ ప్రయాణంలో సుమారు 6 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుసుకుని, డిజిటల్ మాధ్యమాల ద్వారా మిలియన్ల మందితో సంభాషించామని చెప్పారు. ఈ పర్యటనలు భద్రత, సాంస్కృతిక వారసత్వం, జాతీయ అస్తిత్వం పరస్పర సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు చేరుకున్న సైక్లిస్టులకు సీఐఎస్ఎఫ్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విశాఖ పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్మన్ రోషిణి అపరంజి, సీఐఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బినితా ఠాకూర్, సీఐఎస్ఎఫ్ డీఐజీలు రాఘవేంద్ర కుమార్, ఎన్.ప్రకాష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీమతి రేఖా నంబియార్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వి.పి.ఎ.అరుణ్ ప్రసాద్, సీనియర్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పాయ్ పాల్గొన్నారు.
దేశ భద్రతకు ప్రజలే ప్రథమ రక్షకులు
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్తో భాగస్వామ్యం కావడానికి ప్రపంచం ఎదురు చూస్తోందని, ఇలాంటి సమయంలో మన దేశం ఎంత భద్రంగా ఉందో ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్లో నిర్వహించిన వందేమాతరం తీర సైక్లోథాన్–2026ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఒక సాధారణ సైక్లథాన్ మాత్రమే కాదని, దేశాన్ని మరింత సురక్షిత దిశగా నడిపించే ఉద్యమమని అభివర్ణించారు. దేశ రక్షణలో సామాన్యులను భాగస్వాములను చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన సీఐఎస్ఎఫ్ అభినందనీయమని స్పష్టం చేశారు. సుదీర్ఘ సైకిల్ యాత్ర చేసిన సైక్లిస్టులను ప్రత్యేకంగా అభినందిస్తూ మెడల్స్తో సత్కరించారు.
సైక్లోథాన్ జాతీయ ఉద్యమంగా అవతరణ


