ఆయన జ్ఞాన నిధి.. ఆస్తిక హేతువాది
సీతంపేట: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం(అరసం) జిల్లా శాఖ ఆధ్వర్యంలో.. విశాఖ పౌర గ్రంథాలయంలో సాహితీవేత్త, ఏయూ విశ్రాంత ఆచార్యుడు చందు సుబ్బారావు సంస్మరణ సభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్తలు చందు సుబ్బారావు చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన సాహితీ సేవలను కొనియాడారు. అరసం రాష్ట్ర నాయకుడు ఉప్పల అప్పలరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ సభకు యూపీఎస్సీ పూర్వ సభ్యుడు ఆచార్య కె.ఎస్.చలం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చందు సుబ్బారావుతో తనకు 50 ఏళ్ల పరిచయం ఉందని, ఆయన అటు సైన్స్కు, ఇటు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఆయన ఒక ఆస్తిక హేతువాది అని పేర్కొన్నారు. అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ చందు సుబ్బారావును జ్ఞాన నిధిగా అభివర్ణించారు. విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. తన పుస్తకాలన్నింటినీ సుబ్బారావు క్షుణ్ణంగా చదివి విశ్లేషించేవారని గుర్తు చేసుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య బాలమోహన్ దాస్ మాట్లాడుతూ.. సుబ్బారావు పద్య జ్ఞానాన్ని, ఆయన ధారణా శక్తిని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, జీఎస్ చలం, ఆచార్య వెలమల సిమ్మన్న, డాక్టర్ డి.వి.సూర్యారావు, ఆచార్య రాజేంద్రప్రసాద్, డాక్టర్ మాటూరు శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ తదితర ప్రముఖులు పాల్గొని సుబ్బారావుకు నివాళులర్పించారు.
చందు సుబ్బారావుకు సాహితీవేత్తల నివాళి


