సామాన్యులకు అత్యాధునిక వైద్య సేవలే లక్ష్యం
కొమ్మాది: వైద్య శాస్త్రంలో వస్తున్న నూతన ఒరవడితో కూడిన అంశాలను ఏకీకృతం చేసి, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాలెన్స్ ఫోరమ్ ప్రధాన లక్ష్యమని ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ప్రదీప్ ఉండవల్లి అన్నారు. రుషికొండలోని సాయిప్రియ రిసార్టులో మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరిలో కళ్లు తిరగడం, నడుస్తున్నప్పుడు తూలిపోవడం వంటి సమస్యలపై సదస్సులో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. చెవిలో బాహ్య, మధ్య, అంతర అనే మూడు విభాగాలు ఉంటాయని వివరించారు. సాధారణంగా కళ్లు తిరగడం వంటి సమస్యలు తలెత్తినప్పుడు 80 శాతం మంది అది కంటికి సంబంధించిన సమస్యగా భావిస్తారని, అయితే చెవిని మెదడుతో అనుసంధానించే నరం ద్వారా కూడా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఐబీఎఫ్ కన్వీనర్లు డి. శ్రీనివాస్, సూరత్, అవినాష్, రమేష్, మాలిక్ తదితరులు పాల్గొన్నారు.


