ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
సింహాచలం : అడవివరంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల దుస్థితిపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాఠశాలలోని డార్మెటరీలు, టాయిలెట్లు దారుణంగా ఉన్నాయని, కనీసం వ్యాక్సిన్లు భద్రపరుచుకోవడానికి ఫ్రిజ్ కూడా లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక సంస్థలో అసంపూర్తి భవనాలు, అపరిశుభ్రత ఉండటం తన నియోజకవర్గానికే అవమానకరమన్నారు. ఈ సమస్యలను ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లానని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆయన, వసతులు మెరుగుపరిచి ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పి.వి. నరసింహం, ప్రిన్సిపాల్ పురుషోది తదితరులు పాల్గొన్నారు.


