ఉత్తరాంధ్ర అభివృద్ధిపై డిప్యూటీ సీఎం సమీక్ష
బీచ్రోడ్డు: ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖను అత్యంత ప్రభావవంతమైన విభాగంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. పల్లెపండగ, అడవితల్లి బాట, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల ప్రగతిపై ఆరా తీసిన ఆయన, గత ఏడాది నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయకపోవడానికి గల కారణాలపై అధికారుల నుంచి వివరణ కోరారు. తనకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదని, క్షేత్రస్థాయిలో పని మాత్రమే కావాలని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. నిధుల దుర్వినియోగాన్ని, విధుల్లో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, కలెక్టర్ హరేందిర ప్రసాద్, ఉపాధి హామీ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ పాల్గొన్నారు.


