మద్యం మత్తే ప్రాణం తీసిందా?
రోడ్డు ప్రమాదంలో వాడచీపురుపల్లి యువకుడి మృతి
పరవాడ: వాడచీపురుపల్లి–పరవాడ రహదారిలో ఎన్టీపీసీ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వాడచీపురుపల్లికి చెందిన వడ్లపూడి మణికంఠ(22) మృతి చెందాడు. పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపిన వివరాలివి. మణికంఠ మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై దేశపాత్రునిపాలెంలోని స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎన్టీపీసీ సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవ్వడంతో మణికంఠ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.


