ఐటీ హిల్స్కు మరో రెండు బస్సులు
మద్దిలపాలెం: ఐటీ ఉద్యోగుల కోసం మధురవాడ ఐటీ హిల్స్కు అదనంగా మరో రెండు ప్రత్యేక బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి శనివారం మద్దిలపాలెం డిపోలో ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న 8 బస్సులకు అదనంగా వీటిని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక బస్సు కొత్తవలస నుంచి, మరొకటి విజయనగరం నుంచి మధురవాడకు నడపనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు చేయనున్న 700 ఎలక్ట్రికల్ బస్సుల్లో, 100 బస్సులను విశాఖ జిల్లాకే కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీ్త్ర శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించడంలో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. సంక్రాంతి సీజన్లో అధిక ఆదాయాన్ని సాధించినందుకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే అర్హులైన కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లకు పదోన్నతి పత్రాలను మంత్రి పంపిణీ చేశారు.కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


