అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న కాపు నేతలు
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, ఆయన ఇంటిపై టీడీపీ గుండాలతో చంద్రబాబు దాడులు చేయించారని ఉమ్మడి విశాఖకు చెందిన కాపు నేతలు ఆక్షేపించారు. ఈ నెల 7న విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన కాపునేతలు పార్టీలకు అతీతంగా అంబటి కుటుంబాన్ని పరామర్శించను న్నారు. వందకు పైగా కార్ల ర్యాలీతో వెళ్లి, అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి, కుమార్తెలు మౌనిక, మనోజ్ఞలకు ధైర్యం చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కాపు నేతలు బుధవారం సమావేశమయ్యారు.
కాపునేతలపై చంద్రబాబు కక్ష
తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేలడంతో గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసి వస్తున్న అంబటి.. గోరంట్లలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేశారనే దాడి చేయించారన్నారు. ఫ్లెక్సీని తొలగించాలని కోరితే టీడీపీ మూకలు నడిరోడ్డుపై బహిరంగంగా కర్రలు, రాడ్లతో దాడికి తెగబడినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆక్షేపించారు. గంటల తరబడి కొనసాగిన రౌడీ మూకల దాడిపై డీజీపీ, అదనపు డీజీపీలకు ఫిర్యాదు చేసేందుకు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫోన్లు చేసినా స్పందించలేదని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీని కలిసేందుకు మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వెళితే ఎస్పీ ఇంటి గేటు బయటే నిలబెట్టారంటే ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థ ఉందో అర్ధమవుతుందంటూ మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించారని, మళ్లీ చంద్రబాబు హయాంలోనే మరో కాపు ఉద్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభంను, ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని గుర్తుచేశారు. కాపులను ఏదో విధంగా అడ్డుతొలగించుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయంగా కనిపిస్తోందని కాపునేతలు మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, కాపు నేతలు బాణాల శ్రీనివాసరావు, వీసం రామకృష్ణ, కోరుకొండ స్వాతి, పీవీ సురేష్, గుడివాడ అనూష, గుండపు నాగేశ్వరరావు, రామజోగి, రాయపూడి అనిల్కుమార్, గుడివాడ లతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


