మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యం
సబ్బవరం: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో నూతనంగా ఎంపికై న 6 వేల మంది కానిస్టేబుల్ శిక్షణార్థులకు మాదకద్రవ్యాల నియంత్రణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంతో రాష్ట్ర పోలీస్ శాఖ మంగళవారం ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జరిగిన ఈ ఒప్పందం ద్వారా, ప్రస్తుతం శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు మాదకద్రవ్యాల కేసుల నమోదు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణపై నిష్ణాతులైన న్యాయ నిపుణులచే శిక్షణ ఇప్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 పోలీస్ శిక్షణ కళాశాలలు, 5 బెటాలియన్లు మరియు 9 పోలీస్ శిక్షణ కేంద్రాలలో తొమ్మిది నెలల పాటు కొనసాగే ఈ శిక్షణలో భాగంగా, ఈ నెల 22వ తేదీ నుంచి ప్రత్యేక ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ తరగతుల ద్వారా ఎన్.డి.పి.ఎస్ చట్టంలోని మెళకువలు, క్షేత్రస్థాయిలో చట్టాన్ని అమలు చేసే విధానాలపై శిక్షణార్థులకు పట్టు సాధించేలా బోధించనున్నారు. ఈ శిక్షణ వల్ల రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసు యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ డి. రామచంద్రరాజు, డీఎస్ఎన్ఎల్యూ ఉపకులపతి ఆచార్య డి. సూర్యప్రకాశరావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఐజీపీ (ట్రైనింగ్) సత్య యేసు బాబు తదితర ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొని మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ఈ విద్యా–పోలీస్ భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
పోలీస్ శాఖ – డీఎస్ఎన్ఎల్యూ మధ్య
చారిత్రాత్మక ఒప్పందం


