పరిశ్రమల్లో భద్రతపై కలెక్టర్ సమీక్ష
మహారాణిపేట: జిల్లా ఆఫ్–సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన క్రైసిస్ గ్రూప్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల్లో పాత యంత్రాలు, స్క్రాప్ను తొలగించి భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఈ నెల 17 నుంచి జరిగే ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ’ దృష్ట్యా పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలని, కాలుష్య నిబంధనలు ఉల్లంఘించకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సురేష్, పరిశ్రమల కేంద్రం జీఎం ఆదిశేషు, పలువురు అధికారులు పాల్గొన్నారు.


