కొత్తగా 52 బార్ లైసెన్స్లకు నోటిఫికేషన్
అల్లిపురం: నగరంలో కొత్తగా 52 బార్ లైసెన్స్ల మంజూరు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ అధికారి ఆర్. ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కొత్త లైసెన్సులు 2026 ఫిబ్రవరి 5 నుంచి 2028 ఆగస్టు 31 వరకు అమలులో ఉంటాయని, పారదర్శకత కోసం లాటరీ పద్ధతిలో వీటిని కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు https://oc. hpfsproject.com, ఆఫ్లైన్ లేదా హైబ్రిడ్ విధానాల్లో ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియ సిరిపురంలోని వీఎంఆర్డీఏ ఉద్యోగ భవన్, ఈ–బ్లాక్లో గల ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కలెక్టర్ సమక్షంలో సిరిపురం జంక్షన్లోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరేనాలో లాటరీ ద్వారా నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థులు ప్రతి బార్కు రూ. 5 లక్షల దరఖాస్తు రుసుము (నాన్–రిఫండబుల్), రూ. 10 వేల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక బార్కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ నిర్వహిస్తారని, లేనిపక్షంలో ఆ నంబరుపై ప్రక్రియ జరగదని అధికారి స్పష్టం చేశారు. లైసెన్సు పొందిన వారు అదే రోజు మొదటి వాయిదాగా రూ. 12.50 లక్షల రిటైల్ ఎకై ్సజ్ పన్ను చెల్లించడంతో పాటు, నెల రోజుల్లోగా అదే మొత్తానికి బ్యాంక్ గ్యారంటీని సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం లైసెన్స్ కాలానికి సంబంధించి 2025–26 ఏడాదికి రూ. 56.26 లక్షలు, 2026–27కు రూ. 82.50 లక్షలు, 2027–28కు రూ. 90.75 లక్షలు పన్నుగా నిర్ణయించారు. వార్షిక పన్నును ఆరు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించామని, ఇతర పూర్తి వివరాల కోసం జిల్లా గెజిట్ను చూడవచ్చని లేదా 0891–2550241 నంబరును సంప్రదించాలని ఆయన కోరారు.


