ఇదేనా సభకిచ్చే గౌరవం
డాబాగార్డెన్స్: సుమారు 25 లక్షల మంది విశాఖ నగర ప్రజలు జీవీఎంసీ కౌన్సిల్పై పెట్టుకున్న నమ్మకం శుక్రవారం జరిగిన సమావేశంతో చెల్లాచెదురైంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన కౌన్సిల్, అక్రమాలు, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాల్సిన పాలనా వ్యవస్థ రాజకీయ ధోరణుల్లో మునిగిపోయి ప్రజల ఆవేదనను అణచివేసింది. సమస్యల పరిష్కారానికి కాదు, విశ్వాస భంగానికి వేదికగా మారిన ఈ సమావేశం ‘‘ఇదేనా జీవీఎంసీ తీరూ?’’ అన్న ప్రశ్నను నగరమంతా ప్రతిధ్వనింపజేస్తోంది. ఇదిలా ఉండగా కౌన్సిల్ హాలే ప్రజాస్వామ్యానికి అవమానంగా మారింది. కూటమి కార్పొరేటర్లు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లపై చేసిన దౌర్జన్యం పాలనా విలువలను మట్టుబెట్టింది. మాటలతో కాకుండా చేతులతో మాట్లాడిన ఈ తీరుపై నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇది కౌన్సిల్ సమావేశమా? లేక రాజకీయ గూండాగిరీ ప్రదర్శనమా? అంటూ మండిపడుతున్నారు.


