విశాఖలో పుణే, వెల్లింగ్టన్ డిఫెన్స్ స్టాఫ్ కాలేజీ వి
సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణలో తూర్పు నౌకాదళం కీలకంగా వ్యవహరిస్తోందని ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్ అన్నారు. తమిళనాడు వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ 81వ స్టాఫ్ కోర్సుకి చెందిన 225 మంది విద్యార్థి అధికారులు, పుణే డీఎస్ఎస్సీకి చెందిన 90 మంది అధికారులు పారిశ్రామిక ప్రదర్శన పర్యటనలో భాగంగా విశాఖలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ను సందర్శించారు. పర్యటనలో భాగంగా అధికారులు ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్ను కలిసి.. నౌకాదళ కార్యకలాపాలపై కమాండ్ ప్లాన్స్ ఆఫీసర్ ఇచ్చిన ప్రజెంటేషన్లో పాల్గొన్నారు. అనంతరం ‘ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలు–భారత నౌకాదళ వ్యూహం’ అనే అంశంపై చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (ఆపరేషన్స్) నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విశాఖలోని ఈస్టర్న్ ఫ్లీట్ యుద్ధ నౌకలు, సబ్–మైరెన్లను క్షేత్రస్థాయిలో సందర్శించి, దేశ సముద్ర రక్షణ సామర్థ్యాలు, నౌకాదళం నిర్వహిస్తున్న బాధ్యతలను పరిశీలించారు.


