ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ వేగవంతం
కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం
మహారాణిపేట: అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జేసీ జి.విద్యాధరితో కలసి డీఆర్వో సత్తిబాబు, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రమబద్ధీకరణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ నెల 18లోగా పట్టాలు పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. మిగిలిన వాటిని మార్చి 31లోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీవో 388 పరిధిలో దరఖాస్తు చేసుకుని ఒక్క రూపాయి కూడా చెల్లించని దరఖాస్తులను రద్దు చేసి, ఆ దరఖాస్తుదారులను జీవో 30 కింద కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించాలన్నారు. గాజువాక ప్రాంతంలో జీవో 45 కింద ఆమోదం పొందిన దాదాపు 1,000 పట్టాలను సిద్ధం చేసి, ఈ నెల 18 నాటికి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. జీవో 296, 388 కింద ఉన్న కన్వేయన్స్ డీడ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, సుమారు 2,000 కన్వేయన్స్ డీడ్లను మార్చి నెలాఖరు కల్లా పూర్తి చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియలో ఉన్న పెండింగ్ పనులను ఈ నెల చివరి నాటికి ప్రాథమికంగా ముగించాలని స్పష్టం చేశారు. జీవో 84, 27 ప్రకారం యూఎల్సీ భూములపై అధికారులతో సమీక్షించారు. అలాగే 22ఏ డీ–నోటిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్పై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.


