సాంస్కృతిక పోటీల్లో దివ్యాంగుల ప్రతిభ
ఆరిలోవ: సమగ్ర శిక్ష, జిల్లా సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో తోటగరువు వద్ద ఎర్నిమాంబ కల్యాణ మండపంలో సోమవారం ప్రత్యేక అవసరాల(దివ్యాంగ) పిల్లలకు సాంస్కృతిక, కళా, హస్తకళ ప్రదర్శన పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 11 భవిత కేంద్రాల నుంచి సుమారు 60 మంది పిల్లలు పాల్గొన్నారు. వివిధ వేషధారణలో పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఈవో ఎన్.ప్రేమకుమార్ ప్రతిభ కనబరిచిన పిల్లల్ని అభినందించి, బహుమతులు అందించారు. అనంతరం అయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఇలాంటి పోటీలు ఇక్కడ నిర్వహించడం ఇదే తొలిసారన్నారు. ఈ పోటీల్లో విభాగాలవారీగా 17 మందికి ప్రథమ, 11 మందికి ద్వితీయ, 10 మందికి తృతీయ బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ జె.చంద్రశేఖర్, ఏయూ ప్రొఫెసర్ ఎం.పుష్పరాజ్యం, ప్రియదర్శిని వికలాంగుల సంస్థ ప్రిన్సిపాల్ పి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


