దేవస్థానానికి ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వాల్సిందే..
సింహాచలం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి చెందిన పలు సంస్థలకు గతంలో ఇచ్చిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం స్థలాలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ స్థలాలు ఇవ్వాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని బుధవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా మాధవ్ స్థానిక విలేకర్లతో మాట్లాడారు. దేవుడి భూములు దేవుడికే చెందాలన్నారు. దేవుడి భూములు తీసుకుంటే ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాల్సిందే అన్నారు. సింహాచలం దేవస్థానం భూములు తీసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలకు బదులుగా ప్రభుత్వం దేవస్థానానికి స్థలాలు ఇవ్వాల్సిందే అన్నారు. దేవస్థానానికి చెందిన 9 వేల ఎకరాల భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. ఒకవేళ అన్యాక్రాంతం జరిగితే తిరిగి తెచ్చుకోవాలన్నారు. సింహగిరిపై భక్తుల సౌకర్యార్థం నిర్మించే అన్ని కట్టడాలు మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరగాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగితే గడచిన చందనోత్సవం రోజు జరిగినటువంటి దుర్ఘటనలు పునరావృతం కావన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 54కోట్లతో ప్రసాద్స్కీమ్ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రసాద్ పథకం, స్వదేశీ దర్శనం పేరిట కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు ఆలయాల అభివృద్ధి జరుగుతోందన్నారు. సింహాచలం దేవస్థానంతో ముడిపడి ఉన్న పంచగ్రామాల భూమస్య తొందరలోనే పరిష్కారమవుతుందన్నారు.


