తిరుమల లడ్డూపై రాజకీయాలు ఆపాలి
అల్లిపురం : తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రబాబు ప్రభుత్వానికి సీపీఐ జాతీయ సమితి సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి హితవు పలికారు. పాలకులే పనిగుట్టుకుని లడ్డూ అంశాన్ని వివాదాస్పదం చేస్తుండడాన్ని ఆక్షేపించారు. మంగళవారం ఆయన అల్లిపురంలో గల సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్టు వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కమ్యూనిజంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో మెడికల్ మాఫియా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మోదీ అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తోందని ఆక్షేపించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటుకు ఇవ్వాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందడం లేదని, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోయిందని పేర్కొన్నారు. మెడికల్ మాఫియాను పెంచి పోషిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 14న సీపీఐ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. నగరంలోని అంతర్గత రహదారులను పీపీపీ పద్ధతుల్లో ప్రైవేట్కు ఇవ్వాలని జీవీఎంసీ ప్రతిపాదనను తప్పుబట్టారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్, కార్యవర్గ సభ్యులు ఎం.పైడిరాజు, ఎం మన్మధరావు, సిఎన్ క్షేత్రపాల్ రెడ్ది, ఎం.మన్మధరావు, ఎన్.నాగభూషణం పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ సమితి సభ్యుడు
జేవీ సత్యనారాయణమూర్తి


