పది, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
మహారాణిపేట: జిల్లాలో త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఎటువంటి అక్రమాలకు తావులేకుండా, అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు, రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్, మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లను పూర్తిగా నిషేధించామని స్పష్టం చేశారు. జిరాక్స్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, పోస్టల్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, డీ–హైడ్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.
ఇతర అభివృద్ధి పనులపై సమీక్ష
వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ప్రభుత్వ భవన నిర్మాణాలకు భూ సేకరణ వంటి అంశాల పురోగతిని సీఎస్కు కలెక్టర్ వివరించారు. అలాగే రేషన్, పెన్షన్ల పంపిణీ, అకౌంటింగ్ వ్యవస్థలపై కూడా అధికారులతో చర్చించారు. ఇన్చార్జి డీఆర్వో సత్తిబాబు, డీఈవో ప్రేమకుమార్, తదితరులు పాల్గొన్నారు.


