గుండె గుభేల్‌: యుద్ధం మరో 20 రోజులు? | Iran War Threatens Spike in Global Food Prices | Sakshi
Sakshi News home page

గుండె గుభేల్‌: యుద్ధం మరో 20 రోజులు?

Apr 4 2026 12:16 PM | Updated on Apr 4 2026 1:05 PM

Iran War Threatens Spike in Global Food Prices

న్యూఢిల్లీ: అమెరికా- ఇరాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాల ఆహార భద్రతకు గుదిబండలా మారాయి. అగ్రరాజ్యం అమెరికా అంచనా ప్రకారం ఈ యుద్ధం మరో రెండు మూడు వారాలు కొనసాగే అవకాశం ఉండటంతో, సామాన్యుని సరుకుల బిల్లు తడిసి మోపెడయ్యేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన ధరలను పెంచడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటేలా చేస్తున్నాయి.

రికార్డు స్థాయిలో ఆహార ధరల సూచీ
ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ (ఎఫ్‌ఏఓ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, మార్చి నెలలో ప్రపంచ ఆహార ధరల సూచీ 2.4 శాతం మేరకు పెరిగింది. ఇది గత ఏడాది సెప్టెంబర్ తర్వాత నమోదైన గరిష్ట స్థాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం, వ్యవసాయ పెట్టుబడి వ్యయాలు భారం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ యుద్ధం గనుక మరో 20 రోజులకు పైగా కొనసాగితే.. రైతులు సాగును తగ్గించడం లేదా తక్కువ ఎరువులు వాడే పంటల వైపు మళ్లే ప్రమాదం ఉందని ఎఫ్‌ఏఓ ప్రధాన ఆర్థికవేత్త మాక్సిమో టోరెరో ఆందోళన వ్యక్తం చేశారు.

చుక్కలు చూపిస్తున్న నూనె, పంచదార..
వంట నూనెలు, పంచదార ధరలు వినియోగదారులకు భారంగా మారుతున్నాయి. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు 5.1శాతం పెరగగా, పామాయిల్ ధరలు 2022 నాటి గరిష్ట స్థాయికి చేరాయి. పంచదార ధర కూడా 7.2శాతం మేరకు పెరిగి రెండేళ్ల గరిష్టాన్ని తాకింది. మరోవైపు గోధుమల ధరలు కూడా 4.3 శాతం పెరగడం గమనార్హం.

భారత రైతులకు ఎరువుల కష్టం
ఈ యుద్ధం భారతీయ రైతాంగంపై నేరుగా ప్రభావం చూపనుంది. భారత్ తన ఎరువుల అవసరాల్లో దాదాపు 26 శాతం పశ్చిమ ఆసియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం కారణంగా ఎరువుల కొరత తప్పదని ‘కేర్ ఎడ్జ్’ రేటింగ్స్ హెచ్చరించింది. మరోవైపు భారత్‌లో పొద్దుతిరుగుడు నూనె వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం మేరకు తగ్గే అవకాశం ఉందని ‘క్రిసిల్’ అంచనా వేసింది.

ఎల్‌పీజీపై ఐఓసీ (ఐఓసీ) క్లారిటీ
వంట గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పందించింది. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని, ప్రతిరోజూ సుమారు 28 లక్షల సిలిండర్లను డెలివరీ చేస్తున్నామని తెలిపింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, సరఫరా స్థిరంగా ఉందని వినియోగదారులకు భరోసా ఇచ్చింది. ఏదిఏమైనప్పటికీ యుద్ధం ముగింపుపై స్పష్టత లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ‘ధరల మంట’ మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: ‘మమ్మల్ని చంపేయండి’.. పాక్‌లో అల్లకల్లోలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement