డిఫెండింగ్ చాంపియన్కు షాక్
క్వార్టర్స్కు అవెంజర్స్, గౌరీ యూత్
విశాఖ స్పోర్ట్స్: వీడీసీఏ డీఎస్ఆర్ స్మారక ట్రోఫీలో అవెంజర్స్ సీసీ, గౌరీ యూత్ సీసీ జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. రైల్వే స్టేడియం వేదికగా బుధవారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్స్లో డిఫెండింగ్ చాంపియన్ పీఎం పాలెం సీసీపై అవెంజర్స్ సీసీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పీఎం పాలెం సీసీ నిర్ణీత 18 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. శ్యాం (48) రాణించగా, వసంత్ (23), రంజిత్ (10) ఫర్వాలేదనిపించారు. అవెంజర్స్ బౌలర్లు యష్, విజయ్, సత్యదేవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అవెంజర్స్ సీసీ.. ఆరంభంలోనే 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విజయ్ (53 నాటౌట్), జగదీష్ (36 నాటౌట్) అద్భుత బ్యాటింగ్తో ఆదుకున్నారు. విజయ్ అర్ధ సెంచరీతో మెరవగా, ఇద్దరూ అజేయంగా నిలిచి 14.4 ఓవర్లలోనే జట్టును విజయతీరాలకు చేర్చారు. పీఎం పాలెం బౌలర్ దేవాశిష్ రెండు వికెట్లు తీశాడు.
గౌరీ యూత్ విజయం
త్రిష్ణా గ్రౌండ్లో జరిగిన మరో మ్యాచ్లో గౌరీ యూత్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గౌరీ యూత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. సంతోష్ (30) రాణించాడు. వైజాగ్ వీకింగ్ సీసీ బౌలర్లలో భాస్కరరావు 4 వికెట్లు తీయగా, ధన 2 వికెట్లు దక్కించుకున్నాడు. లక్ష్య ఛేదనలో వైజాగ్ వైకింగ్స్ సీసీ 17.4 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ యాదగిరి (35), మిడిలార్డర్లో చిన్నా (31) పోరాడినా ఫలితం లేకపోయింది. గౌరీ యూత్ బౌలర్ ప్రకాష్ 4 వికెట్లతో చెలరేగగా.. వినీత్, శశాంక్ చెరో రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు.


