వక్ఫ్ భూముల సేకరణను నిలిపివేయాలి
మహారాణిపేట: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని వక్ఫ్ భూముల సేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ సీఎంఏ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ.. మంగళగిరి మండలంలో అంజుమన్ సొసైటీకి చెందిన సుమారు 71.57 ఎకరాల వక్ఫ్ భూముల సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. ఇవి మతపరమైన, విద్యా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములని, వీటిపై వచ్చే ఆదాయంతో రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థులకు, మసీదుల నిర్వహణకు నిధులు అందుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం జనరల్ సెక్రటరీ కేవీ బాబా మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టం–1995 ప్రకారం వక్ఫ్ ఆస్తులు బదిలీ చేయడానికి వీల్లేదని గుర్తుచేశారు. వక్ఫ్ బోర్డును సంప్రదించకుండా, నోటీసులు ఇవ్వకుండా భూసేకరణ చేపట్టడం వల్ల ముస్లిం సమాజానికి కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన యంత్రాంగం స్పందించి వక్ఫ్ స్వభావాన్ని కాపాడాలని కోరారు. కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు షేక్ బాబ్జి, తూర్పు నియోజకవర్గ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎం.డీ.మక్బుల్, సౌత్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎం.డీ.యాసిన్, 36 వార్డు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు షకిల్, నాయకులు అనిఫ్. జకీమ్, ఎండీ నజీమ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్కు వైఎస్సార్సీపీ
మైనార్టీ విభాగం వినతి


