బార్ ఏర్పాటుపై మహిళల ఆగ్రహం
మహారాణిపేట : నివాస ప్రాంతంలో, దేవాలయం సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనే యత్నంపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఆఫిషియల్ కాలనీలో, శ్రీ బెల్లం వినాయక దేవాలయం వద్ద బార్ ఏర్పాటు చేయడాన్ని జాలారిపేట, పెద జాలారిపేట, రెల్లివీధి, జబ్బరతోట ప్రాంతాల మహిళలు వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. బార్కు సమీపంలో దేవదాయశాఖకు చెందిన శ్రీ బెల్లం వినాయకుడు దేవాలయం, జీవీఎంసీకి చెందిన అచ్చుతరామ పాఠశాల, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి చెట్టు, భూలోకమాత గుడి ఉన్నాయని వారు తెలిపారు. దేవాలయం, పాఠశాల పక్కన మద్యం షాపు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. మద్యం సేవించిన వారి ప్రవర్తన వల్ల మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ పొలిపిల్లి జ్యోతి, స్థానికులు సురకాల వేణు పోలరాజు, దశమంతుల చిన్ని, దశమంతుల మాణిక్యలరావు తదితరులు కలెక్టర్ పరిపాలనాధికారి బి.వి.రాణిని కలిసి వినతిపత్రం సమర్పించారు. బార్ ఏర్పాటును తక్షణం నిలిపివేయాలని వారు కోరారు.
తెరవెనుక జనసేన నాయకుడు
ఈ బార్ ఏర్పాటు వెనుక జనసేన ప్రసాద్ ఉన్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ప్రసాద్కు దక్షిణ, ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గాల్లో బార్లు, మద్యం షాపులు ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు జననివాసాలు, బెల్లం వినాయకుడు, స్కూల్ వద్ద బార్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం పట్ల మహిళా సంఘాలు ఆగ్రహంతో ఉన్నారు.
బార్ ఏర్పాటుపై మహిళల ఆగ్రహం


