పెళ్లి కళ
వచ్చేసింది
సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు లోగిళ్లలో మళ్లీ పెళ్లికళ సంతరించుకోనుంది. దాదాపు 90 రోజుల పాటు గురు, శుక్ర మూఢాల కారణంగా నిలిచిపోయిన శుభకార్యాలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇన్నాళ్లూ అడ్డంకిగా మారిన శూన్యమాసాలు తొలగిపోవడంతో.. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యేందుకు జంటలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 19 నుంచి మే 13 వ తేదీ వరకు బలమైన ముహూర్తాలు ఉండటంతో వివాహాలు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. – మహారాణిపేట
19 నుంచి మే 13 వరకు
పెళ్లిళ్ల జోరు
మూడు నెలల విరామం తర్వాత
మళ్లీ శుభకార్యాల కళ
వ్యాపారాల్లోనూ ‘శుభ’ కళ
ముహూర్తాలు లేక గత మూడు నెలలుగా స్తబ్దుగా ఉన్న వివాహ సంబంధిత వ్యాపారాలు ఇప్పుడు మళ్లీ కళకళలాడుతున్నాయి. కల్యాణ మండపాలు, క్యాటరింగ్, డెకరేషన్, బ్యాండ్ మేళాలు, ఫొటోగ్రాఫర్లు, ఈవెంట్ మేనేజర్లు, వస్త్ర, బంగారు వ్యాపారులు తిరిగి బిజీ అయిపోయారు. ముహూర్తాలు ఖరారు చేసుకునేందుకు జనం పండితుల వద్దకు క్యూ కడుతుండగా, ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మూఢాల్లో కేవలం అన్నప్రాసన, నామకరణం వంటి చిన్న కార్యక్రమాలకే పరిమితమైన వారు.. ఇప్పుడు భారీ వేడుకలకు సిద్ధమవుతున్నారు.
మే 13 వరకు సందడి
గత ఏడాది నవంబర్ 26 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీ వరకు మూఢాల కారణంగా శుభకార్యాలకు బ్రేక్ పడింది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అధిక మాసం మినహా, మిగిలిన మాసాల్లో శుభముహూర్తాలు ఉన్నాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో కూడా అధిక సంఖ్యలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అయితే.. మే 14 నుంచి జూన్ 13వ తేదీ వరకు అధిక జ్యేష్ట మాసం రానుండటంతో ఆ నెల రోజులు మళ్లీ ముహూర్తాలకు విరామం ఉంటుంది. తిరిగి నిజ జ్యేష్ట మాసం, ఆ తర్వాత వచ్చే మాసాల్లో శుభకార్యాలు ఊపందుకుంటాయి.


