ఐసీఏఐ అధ్యక్షుడిగా విశాఖ వాసి ప్రసన్నకుమార్
మద్దిలపాలెం: విశాఖకు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ డి.ప్రసన్నకుమార్ ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ (ఐసీఏఐ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు సంస్థ ఉపాధ్యక్షుడిగా సేవలందించిన ఆయన గురువారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐసీఏఐ అధ్యక్షుడిగా ఎన్నికై న తొలి వ్యక్తి కావడం విశేషం. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా నెడంబరం గ్రామం ఆయన స్వస్థలం. సీఏలో ఉత్తీర్ణత సాధించిన అనంతరం 1985లో విశాఖపట్నంలో స్థిరపడ్డారు. ఇక్కడి ‘శ్రీరామమూర్తి అండ్ కో’ సంస్థలో వృత్తి జీవితం ప్రారంభించారు. విద్యార్థి దశలోనే దక్షిణ భారత సీఏ విద్యార్థి సంఘంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
అంతర్జాతీయ వేదికలపై భారత గళం
ప్రసన్నకుమార్ ఐఎఫ్ఏసీ బోర్డులో ఐసీఏఐ ప్రతినిధికి టెక్నికల్ అడ్వైజర్గా వ్యవహరించారు. ఎస్ఎస్ఏలోనూ కీలక కమిటీలకు అధ్యక్షత వహించారు. కార్పొరేట్ చట్టాలు, బ్యాంక్ ఆడిట్ వంటి అంశాలపై వందలాది ఐసీఏఐ సెమినార్లలో ప్రసంగించారు. 2022లో వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్లో పత్రం సమర్పించారు. 2025లో మెక్సికో సిటీలో కృత్రిమ మేథస్సుపై, జకార్తాలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్పై జరిగిన ఐఎఫ్ఏసీ సమావేశాల్లో ప్రసంగించారు.
అంచెలంచెలుగా ఐసీఏఐ శిఖరానికి..
ప్రసన్నకుమార్ ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్కు 2019–22, 2022–25, 2025–29 కాలాలకు ఎన్నికయ్యారు. 2025–26లో సంస్థ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. యూడీఐఎన్ అమలు, ఐసీఏఐ ఈఆర్పీ వ్యవస్థల అభివృద్ధి, పీర్ రివ్యూ బోర్డు, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కమిటీ వంటి కీలక కమిటీలకు నాయకత్వం వహించారు. అదనంగా మూడు సంవత్సరాల పాటు బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్కు అధ్యక్షుడిగా సేవలందించారు.


