కాంట్రాక్ట్ సంస్థకు కాసుల వర్షమే
ఈ ప్రాజెక్టు దక్కించుకునే కాంట్రాక్ట్ సంస్థకు కాసుల వర్షం కురుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాంట్రాక్టర్ పెట్టే 60 శాతం పెట్టుబడి ఖర్చును కూడా బ్యాంక్ వడ్డీతో పాటు అదనంగా మరో 1.25 శాతం కలిపి జీవీఎంసీ తిరిగి చెల్లిస్తుంది. రోడ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత పదేళ్ల పాటు ప్రైవేటు సంస్థ వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చును కూడా జీవీఎంసీ విడిగా వాయిదాలతో సంబంధం లేకుండా చెల్లిస్తుంది. ఈ ప్రాజెక్టుకు పెట్టిన పెట్టుబడితోపాటు ఆ రోడ్ల వెంట వాణిజ్య ప్రకటనల లబ్ధిని కాంట్రాక్టర్కు కట్టబెడుతున్నారు. రోడ్డు మధ్యలో ఉండే మీడియన్లు, వీధి దీపాలు, బస్టాపులు, స్ట్రీట్ ఫర్నిచర్ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయాన్ని సదరు కాంట్రాక్టు సంస్థే దక్కించుకుంటుంది. అంతేకాకుండా, రోడ్డు కటింగ్ పర్మి షన్ల ద్వారా వచ్చే ఫీజులు కూడా ఆ సంస్థకే చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. అంటే.. ఒకవైపు ప్రజల పన్నుల రూపంలో రూ.కోట్లు ఆన్యుటీ చెల్లిస్తూనే.. మరోవైపు నగరంలోని విలువైన ప్రకటనల ఆదాయాన్ని కూడా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం గమనార్హం. ఇప్పటికే 2025 డిసెంబర్ 31న టెండర్ నోటిఫికేషన్ జారీచేసిన జీవీఎంసీ అధికారులు జనవరి 20వ తేదీన ప్రీ బిడ్ సమావేశం కూడా నిర్వహించారు. బిడ్లను సమర్పించేందుకు ఫిబ్రవరి 12వ తేదీ వరకూ గడువు విధించడంతో పాటు ఫిబ్రవరి 27న ప్రైస్ బిడ్ను తెరవనున్నట్టు కూడా ప్రకటించారు. అనంతరం ఒప్పందం చేసుకున్న తర్వాత 12 నెలల్లోగా రోడ్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ రోడ్లను సదరు కాంట్రాక్టు సంస్థలే 10 ఏళ్లపాటు నిర్వహించనున్నారు. తద్వారా ఈ రోడ్లపై జీవీఎంసీ నుంచి పూర్తిస్థాయిలో ప్రైవేటు చేతుల్లోకి పోనున్నాయన్నమాట. అంతేకాకుండా పీపీపీ కింద గుర్తించిన రోడ్లన్నీ నగరంలో కీలకమైన ప్రాంతాలకు చెందినవి కావడం గమనార్హం. ఈ రోడ్లపై వచ్చే ప్రకటనల ద్వారా ప్రస్తుతం జీవీఎంసీ ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. ఈ ఆదాయం మొత్తం తాజా నిర్ణయంతో ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లడం వల్ల జీవీఎంసీ గుల్ల అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


