మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, మంగళవారం బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్(పురుషుల) చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. అర్జున అవార్డు గ్రహీత నీలంశెట్టి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ స్థాయి క్రీడా ఉత్సవానికి ఏయూ వేదిక కావడం సంతోషదాయకమని, క్రీడాకారులు పతకాలతో పాటు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆకాంక్షించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైవిధ్యమైన క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడాకారుల కఠోర సాధన, క్రమశిక్షణ అభినందనీయమని పేర్కొన్నారు. క్రీడలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒక చాంపియన్తో సమానమన్నారు. ఏఐయూ అబ్జర్వర్ డాక్టర్ కౌకబ్ అజీమ్ మాట్లాడుతూ.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని విజేతలుగా ఎదగాలని సూచించారు. ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య ఎన్. విజయమోహన్ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 115 విశ్వవిద్యాలయాల నుంచి 509 మంది క్రీడాకారులు, 155 మంది కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నట్లు తెలిపారు. మొత్తం ఎనిమిది విభాగాలలో పతకాలను అందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా అతిథులను సత్కరించి, మిస్టర్ ఆల్ ఇండియా ట్రోఫీని ఆవిష్కరించారు. బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.గురునాథరావు, విశాఖ బిల్డర్స్ అసోసియేషన్ చీఫ్ పేట్రన్ కె.వేణుగోపాల్, ఏయూ విశ్రాంత బాడీబిల్డింగ్ కోచ్ డాక్టర్ ఆర్.వి.ఎన్ రత్నాకర్, ఏయూ రెక్టార్ ఆచార్య పి.కింగ్, ప్రిన్సిపాల్స్ ఆచార్య కె.సీతామాణిక్యం, ఎం.వి.ఆర్.రాజు, పద్మశ్రీ, ప్రొఫెసర్ జాలాది రవి, క్రీడా విభాగాధిపతి ఆచార్య ఎ.పల్లవి తదితరులు పాల్గొన్నారు.
ఏయూలో ప్రారంభమైన ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలు


