మహిళలను గౌరవిద్దాం...భద్రత కల్పిద్దాం
పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి
ఏయూక్యాంపస్: మహిళలను గౌరవిద్దాం.. వారికి భద్రత, భరోసాను కల్పిద్దామని విశాఖ పోలీసులు నినదించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సన్నాహకాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం బీచ్రోడ్డులో పోలీసు సిబ్బంది ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. పెద్దసంఖ్యలో మహిళా పోలీసులు ప్లకార్డులు చేబూని వైఎంసీఏ నుంచి పోలీస్ మెస్ వరకు ఈ అవగాహన యాత్రను చేపట్టారు. ఆడపిల్లలను వేధించడం, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వంటి అంశాలపై జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికావద్దని ఈ సందర్భంగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహిళల రక్షణ కోసం ‘శక్తి యాప్’ ఒక కవచంలా నిలుస్తుందని వివరించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. మహిళలు ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు వెంటనే ‘శక్తి యాప్’ను వినియోగించాలని, వారికి తక్షణ సాయం అందించేందుకు తమ సిబ్బంది 24 గంటలూ సిద్ధంగా ఉన్నారని భరోసా ఇచ్చారు. మహిళలపై హింస, ఈవ్ టీజింగ్, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలను గౌరవించడం, వారికి రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీపీలు లతా మాధురి, మేరీ ప్రశాంతి, ఏసీపీ అన్నెపు నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


