కేజీహెచ్లో నర్సులే వైద్యులు
హౌస్ సర్జన్ల కొరతతో కీలక నిర్ణయం
మహారాణిపేట: కేజీహెచ్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన 250 మంది హౌస్ సర్జన్ల శిక్షణ గడువు ఇటీవల ముగిసింది. అయితే, కొత్త బ్యాచ్ విధుల్లో చేరడానికి కనీసం మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ఆసుపత్రిలో రోగులకు ఇబ్బంది కలగకుండా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి సుమారు 400 మంది నర్సులు పీజీ వైద్యులకు సహాయకారిగా, దాదాపు హౌస్ సర్జన్ల స్థాయిలో విధుల్లో పాల్గొననున్నారు. గురువారం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి పలు నర్సింగ్ కళాశాలల యాజమాన్యాలు, ఆసుపత్రి నర్సులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వార్డుల్లో పీజీ వైద్యులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడానికి నర్సులు సుముఖత వ్యక్తం చేశారు. రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సుల విధులను మూడు షిఫ్టులుగా విభజించినట్లు డాక్టర్ వాణి తెలిపారు. ఉదయం వేళల్లో 50 శాతం మంది, మధ్యాహ్నం 25 శాతం మంది, రాత్రి వేళల్లో మిగిలిన 25 శాతం మంది చొప్పున నర్సుల సేవలను వినియోగించుకోనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.


