సర్జరీ అని చెప్పి కిడ్నీలు తీసేసారు : తీవ్ర ఉద్రిక్తత | kidneys removed doctor admits mistake Family protests in Satna madhya pradesh | Sakshi
Sakshi News home page

సర్జరీ అని చెప్పి కిడ్నీలు తీసేసారు : తీవ్ర ఉద్రిక్తత

Apr 14 2026 5:45 PM | Updated on Apr 14 2026 5:52 PM

kidneys removed doctor admits mistake Family protests in Satna madhya pradesh

మధ్యప్రదేశ్‌లోని సత్నాలో దారుణం చోటు చేసుకుంది.  ఒక ఆసుపత్రిలో కిడ్నీలో రాళ్లకు సర్జరీ చేయాల్సిన వైద్యుడు తప్పిదంగా కారణంగా ఏకంగా రెండు కిడ్నీలను తొలగించారు.  చివరికి పరిస్థితి విషమించడంతో  యువకుడు చనిపోయిన ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతతను రాజేసింది.

పన్నా జిల్లాలోని దేవేంద్రనగర్‌కు చెందిన రవి రాజక్‌కు కిడ్నీలో రాళ్ల సమస్య ఉంది. అతని కుటుంబ సభ్యులు చికిత్స కోసం సత్నాలోని ముఖ్తియర్‌గంజ్‌లో ఉన్న ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షల అనంతరం, వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఏప్రిల్ 4న పాఠక్ నర్సింగ్ హోమ్‌లో సుమారు 5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ తర్వాత రోగి పరిస్థితి విషమించడంతో, అతడిని రేవాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యులు రెండవ మూత్రపిండాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది. దీని తర్వాత రోగి పరిస్థితి నిరంతరం విషమించి, చివరికి మరణించాడు .మరోవైపు పొరపాటున కిడ్నీలను తొలగించామని  డాక్టర్  కూడా ఒప్పుకున్నారు.

 > 
 

రేవాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అక్షయ్ శ్రీవాస్తవ స్పందిస్తూ రోగిని యూరాలజీ విభాగంలో చేర్పించే సమయానికే  అతని కిడ్నీ పనిచేసే స్థితిలో లేదని తెలిపారు.  చికిత్స ఎక్కువ సత్నాలోనే జరిగిందని, రేవాలో కేవలం డయాలసిస్ మాత్రమే నిర్వహించినట్టు తెలిపారు.

మరోవైపు  వైద్యులు నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమని, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మృతుడి తండ్రి గిర్ధారిలాల్ రజక్ ఆరోపిస్తూ, తన కుమారుడికి కేవలం మూత్రపిండంలో రాయి సమస్య మాత్రమే ఉందని, కానీ చికిత్సలోనిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. డాక్టర్ పుష్పేంద్ర సింగ్, డాక్టర్ రాజీవ్ పాఠక్ ,డాక్టర్ రాజీవ్ సింగ్‌ అనే ముగ్గురు వైద్యులపై కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రూ.20 కోట్ల నష్ట పరిహారం డిమాండ్ చేశారు.

మృతదేహాన్ని కోల్గావాన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంచి హైవేను దిగ్బంధించారు. ఆ తర్వాత  పాఠక్ ఆసుపత్రి బయట మరో నిరసన చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మూడు పోలీస్ స్టేషన్ల నుండి పోలీసులను మోహరించారు. సుమారు 4 గంటల పాటు సాగిన నిరసన అనంతరం వైద్యులు , మృతుడి కుటుంబ సభ్యుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చివరగా, 5 లక్షల రూపాయల చెక్కు , 50 వేల రూపాయల తక్షణ నగదు సహాయం అందించే విషయమై ఒక ఒప్పందం కుదిరింది. దీనితో నిరసన ముగిసింది.రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి నుండి పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు  తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:  అమెరికాకు చైనా వార్నింగ్‌ : నాలుగు కీలక ప్రతిపాదనలు

Advertisement
 
Advertisement
Advertisement